Thursday, February 9, 2023

7 suffocate to death while cleaning oil tank at private factory in Andhra Pradesh's Kakinada

ఆయిల్ ట్యాంక్ లో దిగి.. ఏడుగురి మృత్యువాత

పొట్టకూటి కోసం ఆయిల్ ఫ్యాక్టరీలో పనికొచ్చి ఒకరి తర్వాత మరొకరిగా మొత్తం ఏడుగురు మృత్యుఒడికి చేరిన దుర్ఘటన ఇది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని జి.రాగంపేటలో ఈ ఘోరం గురువారం చోటు చేసుకుంది. ఇక్కడ అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం విధుల్లోకి వచ్చిన ఇద్దరు కార్మికుల్ని యాజమాన్యం ఆయిల్ ట్యాంక్ శుభ్రపర్చాల్సిందిగా పురమాయించింది. సుమారు 50 అడుగుల ట్యాంక్ లోకి తొలుత ఇద్దరు కార్మికులు  దిగారు. అందులో ఊపిరాడక వారు స్పృహ కోల్పోయారు. దాంతో వారిని రక్షించడానికి మరో ఇద్దరు అందులోకి దిగారు. ఈ నలుగురు నుంచి స్పందన లేకపోవడంతో మరో ముగ్గురు కార్మికులు ట్యాంక్ లో దిగి ఊపిరాడక లోపల పడిపోయారు. అలా ఒకరి తర్వాత ఒకరిగా ఏడుగురు కార్మికులు ప్రాణాలు ఒదిలారు. ఈ కార్మికులు ట్యాంక్ లు శుభ్రపరిచే పనివారు కాదని తెలుస్తోంది. వీరంతా ప్యాకింగ్ విధులు నిర్వర్తించే వారిగా గుర్తించారు. వీరికి ఆక్సిజన్ సిలిండర్లు, కనీసం మాస్క్ లు కూడా ఇవ్వకుండా ట్యాంక్ లోకి దింపినట్లు సహ కార్మికులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో ఒకరి భార్య నిండు గర్భిణి కాగా మరో కార్మికుడు అతని తల్లిదండ్రులకు ఏకైక సంతానమని సమాచారం. చనిపోయిన ఏడుగురిలో అయిదుగురు పాడేరు కు చెందిన వారు కాగా మరో ఇద్దరు స్థానిక పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని భావిస్తున్నారు.

Wednesday, February 1, 2023

MLA kotam reddy sridhar reddy Serious On Phone Tapping

ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు బయటపెట్టిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ కలకలం చెలరేగింది. ఏకంగా అధికార వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నే సాక్షాత్తూ ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆధారాలు బయటపెట్టారు. అధికారంలో ఉన్న పెద్దల అనుమతితోనే ఇంటెలిజెన్స్ వర్గాలు తన ఫోన్ ను ట్యాప్ చేశాయన్నారు. తన మిత్రుడితో ఫోన్ మాట్లాడుతున్న ట్యాపింగ్ ఆడియోను విలేకర్లకు ఫార్వార్డ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్త అయిన తన చిన్ననాటి మిత్రుడితో మాట్లాడిన ఫోన్ ను ట్యాప్ చేసి ఆ ఆడియోను తనకే పంపి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. తామిద్దరం ఐఫోన్ లో మాట్లాడుకోగా ట్యాప్ చేశారన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఆ ఆడియోను తనకే పంపి ఎందుకిలా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారని వివరించారు. గత మూణ్నెల్లుగా తన ఫోన్ ట్యాప్ అవుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ లేదా సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓలో కీలక సలహాదారు ధనుంజయ్ రెడ్డి తదితరుల అనుమతి లేకుండా అధికారులు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ను ట్యాప్ చేసే సాహసం చేయరని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అనుమానం ఉన్నచోట ఉండలేనని పార్టీ నుంచి బయటకు వచ్చేయనున్నట్లు తెలిపారు. 2014, 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి తరఫున కోటంరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చినా తనకు ఎంతమాత్రం ప్రాధాన్యం ఇచ్చింది అందరికీ తెలుసునని ఆయన బాధను వ్యక్తం చేశారు. నటన తనకు చేతకాదని ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డం మాత్రమే తెలుసన్నారు. నియోజకవర్గంలో చాలా పనులు పెండింగ్ లో ఉండిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికలకు ఇంకా 15 నెలలు సమయం ఉన్నందున తొందర పడవద్దని సహచరులు తనను వారించారన్నారు. అయినా ఇక ఎంతమాత్రం పార్టీలో కొనసాగలేనని చెప్పారు. అధికార పార్టీకి చెందిన 35మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్నట్లు కోటంరెడ్డి పాత్రికేయులకు తెలిపారు. అయితే కోటంరెడ్డి ఆరోపణల్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఖండించారు. తమకు ఎవరి ఫోన్ ను ట్యాప్ చేయాల్సిన అగత్యం లేదని తేల్చి చెప్పారు.    

Tuesday, December 27, 2022

Covid BF-7 Sub Variant Scare: Mock Drill In Hospitals Across Country

దేశ వ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బి.ఎఫ్-7 ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మంగళవారం మాక్ డ్రిల్ చేపట్టారు. కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మార్గదర్శకత్వంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు సమాయత్తమయింది. గత కొన్ని రోజులుగా చైనా, జపాన్ , హాంకాంగ్, దక్షిణకొరియా తదితర దేశాల్లో బి.ఎఫ్-7 కల్లోలం సృష్టిస్తోంది. దాంతో దేశంలో మోదీ సర్కారు అప్రమత్తమయింది. వ్యాక్సిన్లు, మందులతో పాటు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు తదితరాల్ని సిద్ధం చేసుకోవాలని ఇటీవల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు దేశం మొత్తం కరోనా సన్నద్ధతపై మాక్ డ్రిల్ చేపట్టింది. కొత్త వేరియంట్ ప్రభావం మనదేశంపై అంతగా ఉండకపోవచ్చునంటూనే జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం కోరుతోంది. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కుల్ని తప్పనిసరి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Wednesday, December 21, 2022

CM YSJagan send Tab gifts with Byjus content to 8th class students of A.P

8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

ఏపీలోని ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను బహుమతిగా అందించే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లాలోని యడ్లపల్లి జడ్పీ హైస్కూల్ లో బుధవారం ఉదయం ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. డిజిటల్ విప్లవంలో విద్యార్థుల్ని సైతం భాగస్వాముల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బాలబాలికలు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకోవాలనే బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను కానుకగా అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రతిఏటా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందజేస్తామన్నారు. ఈ ఏడాదికి సంబంధించి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ట్యాబ్ ల పంపిణీ జరుగనుంది. రాష్ట్రంలోని 9703 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 4,59,564 మంది పిల్లలకు, 59,176 మంది ఉపాధ్యాయులకు వీటిని అందించనున్నారు.  ఇందుకుగాను రూ.686 కోట్లను వెచ్చించి మొత్తం 5,18,740 ట్యాబ్ లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు బైజూస్ కంటెంట్ ను అందించనున్నారు. ఇంటర్నెట్ లేకుండా ట్యాబ్ ల్లో ఆ పాఠాలను చూసి పిల్లలు నేర్చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఈరోజు సీఎం జగన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా బాలలు ముక్తకంఠంతో శుభాకాంక్షలు తెలిపారు.